మనిషి వైఫల్యాలను దాచి కథల్లో అంతా సవ్యంగానే జరిగిపోతుందన్న హామీని, ఆశను చూపిస్తే పాఠకుల్ని మోసగించడమే అవుతుంది. మానవ జీవితంలో విషాదముంది. దుఃఖం వుంది. తప్పించుకోలేని వైఫల్యం వుంది. దీనికి కార్యకారణ సంబంధాల్ని ఆపాదించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా, ఆ విషాదాన్ని తప్పించుకోలేం. దీన్ని గుర్తించక తప్పదు. ఈ గుర్తింపు మాత్రమే మనిషికి సాంత్వనని ఇస్తుంది. విషాదం తాలూకు భారాన్ని అధిగమించి జీవించడానికి ప్రేరణనిస్తుంది. సంక్లిష్టమవుతున్న మానవ జీవితంలో విషాదం అన్నది పెరుగుతుందేగాని తగ్గడం లేదు. నిరంతర ఘర్షణ, పెనుగులాటతో మనిషి సతమతమవుతున్నాడు. ఈ రకమైన సంఘర్షణ వరలక్ష్మి చాలా కథల్లో వ్యక్తమవుతుంది.
సరికొత్త భావజాలం సమాజంలో వేళ్ళూనుకొనే స్థితిలో ఆధునికమనుకున్నది నేడు పాత/ కాలంచెల్లిన భావ జాలంగా చరిత్ర పుటలకు ఎక్కుతుంటుంది. ఒక్కోసారి ఆయా కాలపు సామాజిక వాస్తవికతను లోతుగా ఆవిష్కరించ లేని స్థితిలో ఆనాటి భావజాలం కొంతవరకు వెనుకబడుతూం టుంది.
ఆధునికత తన అంతర్గత సౌష్టవాన్ని పూర్తిగా నూతనంగా సృష్టించుకోవడం, శకలాలు శకలాలుగా విడిపోవడం, భావాలలోనే కాక జీవన వ్యవస్థలోనూ ఈ క్రమం పర్యవసించడం మూలంగా మరోకొత్త నిర్మాణాల్లోకి ప్రవహించడం ఒక అనివార్య సామాజిక పరిణామంగా గుర్తిస్తాం. ఈ గుర్తింపు సాహిత్యంలో స్పష్టా స్పష్టంగా గోచరిస్తుంది. అలాంటి సృజన సాహిత్యంలో కె.వరలక్ష్మి గారి కథా సాహిత్యాన్ని ముందుగా చెప్పుకోవాలి.
వరలక్ష్మి కథల్లో స్థానీయతా లక్షణం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మధ్యతరగతి కంటే మరింత క్రిందిస్థాయిలో బ్రతుకుతున్న స్త్రీల జీవితాలను చాలా దగ్గరగా నిశితంగా పరిశీలించారు రచయిత్రి. వాళ్ళ జీవితాలు అలా ఎందుకున్నాయో ఈమెకు తెలుసు. కానీ ఏ సిద్ధాంత ప్రభావంతోనూ వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని లేశ మాత్రమూ సూచించరు. తనకు ఎదురైన నిస్సహాయ స్త్రీల మనో వేదనల్ని చిత్రించడం వరకే రచయిత్రి తన బాధ్యతగా గుర్తి స్తారు. ఎవరి సమస్యలకు వాళ్ళే పరిష్కారాలు వెతుక్కోవాలనేది వరలక్ష్మి కథా సూత్రం. రావిశాస్త్రి అథోజగత్ సోదర జీవితాలను వస్తువుగా ఎన్నుకోవడంలోని ప్రత్యేకతలాంటి ప్రత్యేకతే కె.వరలక్ష్మి కథలకుంది. ఈమె క్రింది, మధ్యతరగతి స్త్రీల జీవితాల్లోని ఒడిదు డుకులను గురించి లోతుగా ఆలోచించగలిగారు.ఈ పరిశీలన స్త్రీల భౌతిక, ఆత్మిక జీవితాల ఆవిష్కరణగా ‘ఖాళీసంచులు’ కథలో దుర్గ; ‘మంత్రసాని’ కథలో లోవ, నీలవేణి; ‘శివంగి’ కథలో శివంగి పాత్రల చిత్రణలో బహిర్గతమవుతుంది.
రచయిత్రి తన కథల్లో వినియోగించిన పాత్రోచిత మాండలిక భాష బహుళత్వ తత్వాన్ని కలిగివుంది. ప్రాంతీయ, స్థానిక గోదావరి మండలాల్లోని క్రిందివర్గాల భాషను తన కథలను శక్తి మంతంగా మలచుకోవడంలో వరలక్ష్మి భాగం చేసుకున్నారు. తన లోని సంవేదనల్ని, జాతీయ ఆర్థిక సంస్కరణల స్వభావాన్ని, మానవ సంబంధాలలోకి దాని నిశ్శబ్ద ప్రవేశాన్ని వాచ్యంగా ఏ కథలోనూ చెప్పలేదు. ఉదాహరణకు స్థానిక జీవిక నుండి ప్రత్యా మ్నాయ జీవికను ఎంచుకోవడంలో బహుజనులు గురవుతున్న వేదనా క్రమాన్ని చాలా కథల్లో చెప్పారు. ఒకవైపు స్థానిక చరిత్రలో చోటుచేసుకుంటున్న మార్పుల్ని చిత్రిస్తూ మరోవైపు బాల్యం నుండి తమ జీవితాల్లో వస్తున్న మార్పుల్ని భౌతిక మార్పులతో సమన్వయం చేసి చక్కటి శిల్పంతో ఆధునిక - అభివృద్ధి విధ్వంస చిత్రపటాన్ని సృజించారు.
వరలక్ష్మి కథల్లో విషయి-విషయంల మధ్య విభేదం బహిర్గత మౌతుంది. అందుకే ఈమె కథల్లో రచయిత ప్రాముఖ్యత తగ్గిపోయి పాఠకుని ప్రాముఖ్యత పెరుగుతుంది. సొంత అనుభూతుల నుంచి అనుభవాల నుంచి ‘‘నీవు నీవుగా వుండే’’ ధోరణిలోకి వెళ్ళేట్లుగా వరలక్ష్మి కథలు పాఠకుల్ని నడిపించగలుగుతాయనడానికి సాక్ష్యంగా నిలిచే కథలు ‘అతడు-నేను’, ‘శివంగి’, ‘ఖాళీ సీసాలు’.
‘ఖాళీసీసాలు’ కథలో దుర్గ తన కష్టాన్నీ జీవితాన్నీ ఫణంగా పెట్టి, తమ్ముడిని ఇంజనీరుగా గుడిసెను పెంకుటిల్లుగా చేయగలి గింది. ఒక ఎకరం పొలం కూడా సంపాదించగలిగింది. తన తల్లి రొయ్యల చెరువులో పనికి పంపినప్పుడుగానీ ఆ తర్వాతగానీ కంటికి నదురుగావున్న దుర్గ తన జీవితాన్ని తాను మలచుకో లేని అసమర్థురాలేం కాదు. వివాహితుడైన కుప్పుస్వామితోనే జీవించాల్సిన అగత్యం ఆమెకు లేదు. కుప్పుస్వామి సాహచర్యంలో కాకుండా వివాహితురాలిగావుంటే తన సంపాదనపైన ఆధార పడిన తన కుటుంబాన్ని ఆదుకొనే అవకాశం ఆమెకు వుండేది కాదు. జీవితం ఎటువైపుకు లాగితే అటువైపు దుర్గ వెళ్ళింది. తమ్ముడు, అతని పిల్లలూ అండగా వుంటారనుకుంది.
తమ్ముడి స్వార్థం ఆమెను ‘ఖాళీసంచు’లతో రోడ్డుపాలు చేసింది. ఈ కథలో ఖాళీ అయినవి సంచులే కాదు దుర్గ హృదయం కూడా. ఎవరికోసమైతే ఆమె తపించిందో, ఎవరిని తన జీవిత సర్వస్వంగా భావించిందో వాళ్ళే (అటు కుప్పుస్వామి, ఇటు తమ్ముడు) భౌతికంగా శక్తిమంతురాలైన దుర్గను నిస్సహాయురాలిగా, అనాథగా మార్చారు. ‘‘నీకు కుప్పుస్వామున్నాడు కదా!’’ అన్న తమ్ముడి మాటల్లోని వ్యంగ్యం, నైతిక చట్రాల అఖండత్వం దుర్గనే కాదు పాఠకుల్ని కూడా నిరుక్తులుగా మారుస్తుంది.
మనిషి వైఫల్యాలను దాచి కథల్లో అంతా సవ్యంగానే జరిగిపోతుందన్న హామీని, ఆశను చూపిస్తే పాఠకుల్ని మోసగిం చడమే అవుతుంది. మానవ జీవితంలో విషాదముంది. దుఃఖం వుంది. తప్పించుకోలేని వైఫల్యం వుంది. దీనికి కార్యకారణ సంబంధాల్ని ఆపాదించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా, ఆ విషాదాన్ని తప్పించుకోలేం. ఇది భరించలేని వాస్తవం. దీన్ని గుర్తించక తప్పదు. ఈ గుర్తింపు మాత్రమే మనిషికి సాంత్వనని ఇస్తుంది. విషాదం తాలూకు భారాన్ని అధిగమించి జీవించడానికి ప్రేరణనిస్తుంది. సంక్లిష్టమవుతున్న మానవ జీవితంలో విషాదం అన్నది పెరుగుతుందేగాని తగ్గడం లేదు. నిరంతర ఘర్షణ, పెనుగులాటతో మనిషి సతమతమవుతున్నాడు. ఈ రకమైన సంఘర్షణ వరలక్ష్మి చాలా కథల్లో వ్యక్తమవుతుంది.
‘అతడు- నేను’ కథలో ఈ సంఘర్షణ మొత్తం అనుభవిస్తుంది ‘ఆమె’ పాత్ర. ఆమె మనసుకు నచ్చని భర్తను, అత్త సాధింపుల్ని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని, తన జీవితాన్ని నిరాశమయం చేసుకోలేదు. ఆమెకు ఎదురైన నిరాశను, నిరుత్సాహాన్ని పాఠకులపైన రుద్దలేదు రచయిత్రి. విషాదాన్ని, వైఫల్యాన్ని చిత్రీకరించే కంటే జీవిత సాఫల్యం వైపుకు పాత్రల్ని నడిపిస్తుంది. తనను హింసించిన భర్తకు పక్షవాతం వస్తుంది. అతనికి సేవలు చేస్తున్న ఆమెను చూసి, స్నేహితురాలు షరీఫా అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు ‘‘సేవాశ్రమంలో ఎలాంటివాళ్ళో తెలియకుండానే మనం వాళ్ళకి సర్వీసు చెయ్యడం లేదూ? ఇతన్నీ అలాగే అనుకొని’’ సేవ చేస్తు న్నానంటుంది. మనిషి జీవించడానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం మనుషుల మీద నమ్మకం, జాలి, దయ, ప్రేమ అన్న ప్రతిపాదనే వరలక్ష్మి కథా లక్ష్యం.
‘శివంగి’ కష్టాన్ని దుర్వ్యసనాలతో నోటికి అందకుండా నష్టపరుస్తున్న శివంగి భర్త; తిండి గింజలు కాజేయడమే కాకుండా రాత్రంతా నిద్ర లేకుండా చిరాకు పెడుతున్న ఎలుక ఇద్దరూ ఆమె నిస్సహా యతను ఆధారంగా చేసుకొని ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఈ రెండు దృశ్యాల్ని ‘శివంగి’ పాత్రతో సాదృశ్యం చేసింది రచయిత్రి. ఈ రెంటి నుంచి శివంగి విముక్తి కోరుకుంది. మొగుడి కంటే ముందు ఎలుక ఆమె కోపానికి గురైంది. ఆమె నిస్సహాయతతో ఆడుకొన్న ఎలుక, ప్రాణంపోయే సమయంలో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి, అది చూసిన చూపు సహజసిద్ధంగా ఆమెలోని జాలి, దయ, కరుణ గుణాలకు ప్రేరణగా పనిచేసింది.
అందుకే అనుక్షణం పీడించే భర్తను (ఎలుక కోసం తెచ్చిన) ఎలకల మందుతో కాచిన టీతో చంపాలనుకుంది. కానీ భర్త క్రౌర్యం నిస్సహాయతలోకి పర్యవసించబోయే క్రమం ఆమెలో నిద్రాణంగా వున్న ప్రేమ బహిర్గతం కావడానికి దోహదకారి అయింది. ఫలితంగా ప్రాణాపాయ స్థితిలోకి పోబోతున్న భర్తను ఆ స్థితి నుండి తప్పించింది. అసహ్యంతో, అవమానంతో రగిలిపోయే ఆమె హృదయం స్థానంలో ఆర్ద్రత ప్రవేశించింది. స్త్రీల ప్రేమ లోని ఔన్నత్యాన్ని ఉన్నతీకరించడమే వరలక్ష్మి కథా దృక్పథం.
సత్యం ఎప్పుడూ ఒక తీరుగా వుండదు. అది శకలాలు శకలాలుగా మార్పుకు గురవుతూ, విచ్ఛిన్నమౌతూ వుంటుంది. శివంగి భర్త ప్రాణాలు తీయాలనుకోవడం సత్యం. కానీ ఆ భావన విచ్ఛిన్నమవ డానికి కారణభూతమైన అంశాలు శివంగి భవిష్యత్తు చిత్రపటాన్ని మార్చేవి కావు. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. ఎందుకంటే నోటి ముందున్న టీని కర్రతో తోసేసినప్పుడు, ఆమె భర్త ‘‘నీయయ్య!’’ అంటూ తిట్లకు లంకించుకుంటాడు. శివంగి అనుభవిస్తున్న హింస గానీ, దానికి కారణమైన భర్త ప్రవర్తనలోగానీ ఏ మార్పు వుండదు.
విషయం తెలిసి కూడా ఆమె అలా ఎందుకు ప్రవర్తించింది? అనే ప్రశ్నలో హేతుబద్ధత వుందేమో గానీ మానవసంబంధాల వికసనక్రమంలో ఆ హేతుబద్ధతకు అవకాశం లేదు.
జీవన పోరాటంలో తుదికంటా నిలబడడానికి ఎంతో ఆత్మవిశ్వాసం అవసరం. అందుకు అనువైన సామాజిక విశ్వాసం కొరవడుతున్న సందర్భంలో విశ్వాసాలు మృగ్యమై భవిష్యత్ చిత్రపటం అగమ్య గోచరంగా మారిన స్థితి. ఈ స్థితిలో ఎవరికీ ఏ విశ్వాసాలు అవసరంలేకపోయినా ఛిద్రమౌతున్న రెక్కల్ని ఎవరంతకు వాళ్ళు సవరించుకోవాలన్న తపనతో మనిషి తనకు తానే దూరమౌతున్నాడు. ఈ సందిగ్ధస్థితిలో తానున్న స్థితినుండి గతంలోకి, గత అనుభవాల స్మృతుల్లోకి జారిపోయి, భావుకతను గుండెనిండా నింపుకొని, ఆ జ్ఞాపకాలతో వర్తమానంలోని వ్యాకులాన్ని రూపుమాపుకునేందుకు దోహదంచేసే ప్రయత్నానికి వరలక్ష్మి కథలు నాంది పలుకుతాయి.
కె. శ్రీదేవి
(ఇటీవల కె.వరలక్ష్మి అజో-విభొ-కందాళం ఫౌండేషన్ నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు.)