సాహిత్యంలో ‘స్వామి’గా వ్యవహరించబడే బండి నారాయణ స్వామి రాయలసీమ బహుజన సమూహానికి చెందిన కథకుడు, నవలాకారుడు. నడకలో నడతలో నిఖార్సైన పల్లెటూళ్లకు చెందిన ‘పాతమనిషి’. ఇటీవల కాలంలో రచయిత స్థితి నుంచి కార్యకర్త గానూ మారి, తన ప్రాంతం కోసం పనిచేస్తున్న వాడు. ఇప్పుడు ఆయన ‘శప్తభూమి’ నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయన ఆలోచనలు యెలా వున్నాయో తెలుసుకుందామని చేసిన ముఖాముఖి యిది. స్వామి నిర్మొహమాటంగా యిచ్చిన సమాధానాలు ఆయన బోళాతనానికి నిదర్శనం.
జి. వెంకటకృష్ణ
తెలంగాణ ఉద్యమక్రమంలో తెలంగాణ ప్రాంతం చారిత్రకంగా, సాంస్కృతికంగా దాదాపు పునరుజ్జీవం పొందింది. కానీ తెలంగాణ విడిపోయిన క్రమంలో రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమ ప్రాంత మూలాలను సామాజికంగా, రాజకీయంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా పరిచయం చేయాలనే ఉద్దేశమే ఈ ‘శప్తభూమి’ నవలను రాయించింది.
ఈ అవార్డు వస్తుందని మీరు అనుకున్నారా?
కన్నడలో వచ్చిన ‘చిక్కవీర రాజేంద్ర’ నవలకు అవార్డు వచ్చిన విషయం నాకు తెలుసు. ‘శప్తభూమి’ చారిత్రక నవల రాస్తున్నపుడు సహజంగనే ఆ విషయం నాకు గుర్తుకు వచ్చింది. నిజానికి అవార్డుల పట్ల నాకు స్పృహ లేదు. ‘శప్తభూమి’ చదివిన పాఠకులు పదేపదే, ఈ నవలకు ఏదో ఒక అవార్డు తప్పనిసరిగా వస్తుందనేవాళ్లు. అవార్డు వచ్చినపుడు ‘శప్తభూమి’ రచయిత కంటే, ‘శప్తభూమి’ పాఠకులే ఎక్కువ ఉద్వేగానికి లోనైనారేమో అనిపిస్తుంది.
కథకుడిగా కూడా గొప్ప కృషి చేశారు. ఇప్పుడు నవలకు బహుమతి అందుకుంటున్నారు. నిజానికి మిమ్మల్ని మీరు ఏమనుకుంటారు? మీకేది సంతృప్తినిస్తుంది?
నా మిత్రుడు, గురువు చిలకూరి దేవపుత్ర ఒకమాట అనేవాడు-- ‘‘కథ తాడు మీద నడవడం లాంటిది, నవల.. విశాలమైన మైదానంలో అరబ్బీ గుర్రం మీద దౌడు తీయడం లాంటిది.’’ కథ, నవలలకు దేని శిల్పం దానికుంది. దేని లోతు, దేని విస్తృతి దానికుంది. నేను కథకుడిననో, నవలాకారుడిననో ఒక ప్రక్రియకు కుదించుకోలేను. కథ శిల్పపరంగా సంతృప్తినిస్తే, నవల... భావజాల ప్రకటన వల్ల ఎక్కువ సంతృప్తినిస్తుంది.
ఈ అవార్డుల ద్వారా, నిర్లక్ష్యానికి గురైన నేలలు, ఆ నేలపుత్రులు గుర్తింపు పొందినట్లు అనుకుంటున్నారా?
2014కు ముందు ఒక రచయిత కథకో నవలకో అవార్డు వచ్చినపుడు ‘ఫలానా వ్యక్తికి వచ్చింది, లేక మా ఆంధ్రప్రదేశ్కు వచ్చింది’ అనుకునేవారు పాఠకులు. కానీ ‘శప్తభూమి’ నవలకు అవార్డు వచ్చినపుడు, ‘ఈ అవార్డు మా రాయలసీమకు వచ్చింది’ అనుకున్న పాఠకులే రాయలసీమలో ఎక్కువ. మరి ఈ ప్రాంతం, ఈ ప్రాంతపు ప్రజలు నవల ద్వారా గుర్తింపు పొందినారా లేదా అన్నది విమర్శకులు చెప్పవలసిన విషయం. కానీ నాకు తెలిసీ, అవార్డుల ద్వారా రచనకు పాఠకుల సంఖ్య పెరుగుతుంది అన్న మాట మాత్రం వాస్తవం.
‘శప్తభూమి’ నవల ఎందుకు రాయాల్సి వచ్చింది?
తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణ ప్రాంతం చారిత్రకంగా, సాంస్కృతికంగా దాదాపు పునరుజ్జీవం పొందింది. కానీ తెలంగాణ విడిపోయిన క్రమంలో రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమ ప్రాంత మూలాలను సామాజికంగా, రాజకీయంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా పరిచయం చేయాలనే ఉద్దేశమే ఈ నవలను రాయించింది.
మెకంజీ కైఫీయత్ల ఆధారంగా, బ్రౌన్ పరిష్కరించగా, గురజాడ అప్పారావు ఎడిట్ చేసిన ‘ది వార్స్ ఆఫ్ రాజాస్’ పుస్తకంలోంచి ‘శప్తభూమి’ మూలకథను, చాలా పాత్రల్ని తీసుకున్నట్టున్నారు?
గురజాడ ఎడిట్ చేసిన ‘ద వార్స్ ఆఫ్ రాజాస్’ కైఫీయత్ నుంచి మూలకథను తీసుకోలేదు. కథా వాతావరణాన్ని మాత్రమే తీసుకున్నాను. అప్పటి రాజులు, ఆస్థానాలు, కుట్రలు, యుద్ధాలు... అదీ రాచరిక వాతావరణం. ఈ రాచరిక వాతావరణంలో అణచివేతలను అనుభవించిన దళిత బహుజనులే ఈ నవలకు మూలకథ అయినారు. ఈ నవలలో వీరమంటపం, కురవల పరస, గులిగానప్ప పరస, సతీసహగమనం... ఈ సందర్భాలన్నీ వాస్తవమైనవి. ప్రజల పాత్రలు కాల్పనికమైనవి. సిద్దరామప్పనాయుడు, కరిహుళ బసవప్ప, బళ్లారి రామప్పనాయుడు, అనంతపురం రామప్పనాయుడు, సిద్దప్పనాయుడు... ఇటువంటి రాచరిక పాత్రలు మాత్రం కైఫీయత్ నుంచి తీసుకున్నాను. బిల్లే ఎల్లప్ప, కోడె నీలడు, ఇమ్మడమ్మ, హరియక్క, నాగప్ప ప్రెగడ, నిడుమామిడి స్వామి, వీరనారాయణ రెడ్డి, కంబళి శరభడు, నల్ల నాగిరెడ్డి, ఎర్ర నాగిరెడ్డి, బయన్నగారి అనంతయ్య శ్రేష్టి, కోమటి పడుచు, పద్మసాని, నాగసాని, తిక్కస్వామి, గొల్లపడుచు, మన్నారుదాసు... ఈ పాత్రలన్నీ కల్పితపాత్రలు. కానీ, చరిత్రలో జరిగిన వాస్తవ సంఘటనలకు ప్రాతినిధ్యం వహించే పాత్రలు. మంగలి గైరమ్మ, విలియం బ్రౌను, మాడల కందప్ప, జక్కుల ఉమాదేవి... వీరంతా చరిత్రలో జీవించిన నిజమైన పాత్రలు.