మడుగులో దాగిన మహారాజు
తన చేతికి చిక్కి బిక్కు బిక్కు మంటోన్న సంజయుని చంపేందుకు ఒరలోంచి కత్తిని సాత్యకి తీశాడో లేదో అతన్ని అడ్డుకుంటూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. సంజయుణ్ణి వధించొద్దని, అతన్ని విడిచిపెట్టమని చెప్పాడు. వ్యాసుని ఆజ్ఞను పాటించాడు సాత్యకి. సంజయుని విడిచిపెట్టాడు.‘‘కృతజ్ఞుణ్ణి’’ అని వ్యాసునికి నమస్కరించి అక్కణ్ణుంచి ముందుకి కదిలాడు సంజయుడు. దుర్యోధనుని అడుగు జాడలు అతనికి కన్పించాయి. వాటిననుసరించి కృష్ణద్వైపాయన మడుగును సమీపించాడు. దుర్యోధనుడు ఉన్నాడక్కడ. సంజయుని అల్లంత దూరం నుంచి చూస్తూనే కన్నీళ్ళు పెట్టుకున్నాడు దుర్యోధనుడు.‘‘మహారాజా’’ ఆందోళన చెందాడు సంజయుడు. దుర్యోధనుని ఓదార్చేందుకు ప్రయత్నించాడు. అయితే అది అతని వల్ల కాలేదు. దైన్యావేశంతో తల పట్టుకుని కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూనే ఉన్నాడు దుర్యోధనుడు. కాస్సేపటికి తేరుకున్నాడు. అప్పుడతని కన్నీళ్ళు తుడిచి, తాను సాత్యకికి చిక్కిన తీరూ, అతను తనని చంపబోతుంటే వ్యాసుడు అడ్డుకుని రక్షించిన తీరూ చెప్పి-‘‘మహర్షి అనుగ్రహం. బతికి బయటపడ్డాను’’ అన్నాడు సంజయుడు.‘‘మనవారు ఇంకెవరు బతికి ఉన్నారు’’ అడిగాడు దుర్యోధనుడు.‘‘ఎవరున్నారు...రథికత్రయం కృప, కృతవర్మ, అశ్వత్థామలున్నారు. అంతే’’ బాధగా చెప్పాడు సంజయుడు.‘‘మిగిలిన వాళ ్ళంతా...పోయారు’’ కళ్ళు చెమర్చుకున్నాడు సంజయుడు. ఆ మాటలకి మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు దుర్యోధనుడు. సంజయుని భుజమ్మీద చేతి నుంచి ఎంతగానో విలపించాడు. కన్నీరు తుడుచుకుని కాస్సేపటికి ఇలా అన్నాడు.
‘‘నువ్వూ, నేనూ...ఆ ముగ్గురూ మొత్తం అయిదుగురం మిగిలామన్నమాట! హుఁ! అదృష్టం బాగుండి, పాండవులు యుద్ధరంగంలో విజృంభించారు. అలసిపోయాను సంజయా! బాగా అలసిపోయాను. ఈ అలసటతో యుద్ధం చేయలేను. అందుకే పాండవులకు చిక్కకుండా ఇటొచ్చాను’’‘‘కూర్చోండి మహారాజా! కూర్చోండి’’ దుర్యోధనుని దగ్గరగా ఉన్న రాతి మీద కూర్చోబెట్టాడు సంజయుడు.‘‘పిల్లలు, త మ్ముళ్ళు, ఆత్మీయులు ఎందరో...ఎందర్నో పోగొట్టుకున్నాను. అంతమందినీ అంతమొందించి పాండవులు పరమానందంతో విర్రవీగుతున్నారు. చూసి తట్టుకోలేకపోయాను. దీన్నే తట్టుకోలేని వాణ్ణి, రేపు ధర్మరాజాదులు రాజ్యభోగాలు అనుభవిస్తోంటే చూసి తట్టుకోగలనా? నా వల్ల కాదు సంజయా! నా వల్ల కాదు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఈ మడుగులో దాగుందామని ఉంది. పాండవులకు కనిపించకుండా కొన్నాళ్ళు ఈ మడుగులో దాగుండి, తర్వాత తప్పించుకుని పాండవుల మీద పగ తీర్చుకుంటాను. వారి అంతు చూస్తాను’’ అన్నాడు దుర్యోధనుడు. పిడికిలి బిగించాడు.‘‘నేను ఇక్కడ ఉన్న సంగతి మా తండ్రికి మాత్ర మే తెలియజెయ్యి. ఉంటాను’’ అని మడుగులోకి దిగాడు దుర్యోధనుడు.
చూస్తూండగానే మోకాళ్ళ లోతుకి, తర్వాత భుజాల వరకు మునిగి, ఆ తర్వాత శిరస్సును కూడా ముంచి మొత్తంగా మడుగులో మునిగిపోయాడు దుర్యోధనుడు. జల స్తంభన విద్యతో నీరు ఒంటికి అంటుకోనీయక విశ్రమించాడక్కడ.ఒడ్డున నిల్చుని ఉండి చూడసాగాడు సంజయుడు. బాధగా కళ్ళు మూసుకున్నాడు. అంతలో పరుగున వస్తోన్న రథచక్రాల శబ్దం వినరావడంతో ఆందోళనగా కళ్ళిప్పి చూశాడు. కృప, కృతవర్మ, అశ్వత్థామలు వస్తున్నారు. గాయాలపాలయి ఉన్నారు ముగ్గురూ. దుర్యోధనుడు కనిపించక పోవడంతో ఆందోళన చెందుతున్నట్టుగా ఉన్నారు. అక్కడ సంజయుడు ఉంటాడనిగాని, ఉన్నాడని గాని వాళ్ళకు తెలియదు. ఆ దారిన ప్రయాణిస్తున్నారంతే! ఊహించని విధంగా వాళ్ళకక్కడ సంజయుడు కనిపించడంతో ఆశ్చర్యపోయి రథాలను ఆపారు. కిందికి దిగారు.‘‘బతికి బయటపడ్డావా సంజయా! ఆనందం’’ అన్నారు.‘‘దుర్యోధనుడు క్షేమమేనా’’ అడిగారు.‘‘మహారాజు నీకు కనిపించాడా’’ ప్రశ్నించారు.‘‘మహారాజు క్షేమమే! కనిపించాడు’’ అన్నాడు సంజయుడు.‘‘ఎక్కడున్నాడు’’ అడిగారు.‘‘అదిగో! అక్కడ’’ అంటూ మడుగులోనికి చూపించాడు సంజయుడు. దుర్యోధనుడు అసహాయుడై అక్కడికి రావడం, మడుగులో దాగుంటానని చెప్పి, దాగున్న తీరు అంతా వివరంగా చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు సంజయుడు.‘‘అయ్యయ్యో’’ అన్నారంతా. పరిపరి విధాల దుఃఖించారు.‘‘మేము చనిపోయామనుకున్నాడు. అందుకే తొందరపడ్డాడు. లేకపోతే ఇక్కడికి, ఈ మడుగు దగ్గరకు రావాల్సిన అవసరమేమున్నది మహారాజుకి’’ బాధపడ్డారు.