అప్పటిదాక చర్చంతా లాక్డౌన్ అమలుపైనే నడిచింది. ఒక పాట.. ఒకే ఒక్క పాట.. ఆ చర్చనంతా తనవైపుకు తిప్పుకుంది.. వలసకూలీల గానం అందుకుంది. ‘ఇంటికాడ పిల్లజెల్ల ఎట్ల ఉండ్రో.. నా ముసలితల్లీ ఏమిబెట్టి సాదుతుందో..’ అంటూ గుండెలోతుల్లోకి చొచ్చుకొచ్చింది. ఆ పాటతో ఆదేశ్ రవికి ఎన్నడూ రానంత పేరొచ్చింది.. ఆయన జీవితం కూడా వలసగానమే..
దుఃఖం వ్యక్తిగతం కాదు, దుఃఖం సామూహికం. వ్యక్తిగత దుఃఖాన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ, కోట్లాది ప్రజల దుఃఖాన్ని విస్మరించడం మాత్రం నేరాతినేరం.. సోక్రటీస్ తత్వం చెబుతుందిదే.. చేతులు కడుక్కోండి.. మూతికి మాస్కు కట్టుకోండంటూ ఎంతసేపూ రోగం చుట్టే తిరుగుతోంది చర్చంతా. మనుషుల గురించి మాట్లాడటం లేదు, చెప్పుల్లేకుండా మండుటెండలో నడిచే వలసకూలీలను పట్టించుకోవడంలేదు. నడిచీ నడిచీ అలసటొచ్చీ.. రోడ్లపైనే కూలిపోతున్న బతుకుల గురించి ఆలోచించడం లేదు. సామూహిక దుఃఖాన్ని మనది కాదన్నట్లు మిన్నకుండి పోయిందీ సమాజం. ఈ ధోరణి దేశానికే సిగ్గుచేటు.
ఇలా మాట్లాడటం ఏ యిజమో నాకు తెలీదు కానీ.. నాకు తెలిసిన యిజమల్లా మనుషులు.. ఉబికి వస్తున్న వాళ్ల దుఃఖం.. గొప్పదని చెప్పుకుంటున్న దేశంలో ఎందుకీ చెడ్డ బతుకు..? పేద రోగం కంటే.. కరోనా పెద్ద రోగం కాదు కదా! ...లాక్డౌన్లో హైవేల వెంబడి.. పీక్కుపోయిన ముఖాలతో.. గుండెల నిండా చావు భయాలతో వెళుతున్న.. వలస కూలీల వ్యథల్ని చూశాక నాకు దుఃఖం ఆగలేదు. నిద్ర పట్టలేదు. కల్లోలం కమ్ముకుంది. నా బాధను ఏదో ఒక రూపంలో వ్యక్తం చేయాలి. అవును, ఒక పాట రాయాలి. అది అందరి గుండెల్లో గునపంలా దిగాలి.. ఆ కసి, ఆ కోపం, ఆ దుఃఖం గొప్ప దేశానికి హెచ్చరిక కావాలి.. అలా పుట్టింది నా ‘ముసలితల్లి..’ పాట.
నాన్న కూడా వలసజీవే..
ఆ పాట పుట్టుకకు బహుశా దేశదిమ్మరి జీవితం కూడా కారణం కావొచ్చు. మా నాన్న వలస బతుకూ ప్రేరణ అయ్యుండొచ్చు. నాన్న దిడ్డి రమణయ్య కమ్యూనిస్టు. ఆయన సొంతూరు కరీంనగర్లోని జమ్మికుంట. అమ్మదేమో సిరిసేడు. అప్పట్లో తెలంగాణలోని పద్మశాలీలు నేత పని కోసం వలసలు వెళ్లేవాళ్లు. అలా నాన్న సోలాపూర్ వెళ్లాడు. ఒక చేత్తో మగ్గం, మరో చేత్తో ఉద్యమం. కమ్యూనిస్టు పార్టీలో గుర్తింపు వచ్చింది. అది ఓర్వలేని ప్రత్యర్థి పార్టీ వాళ్లు రెండుసార్లు హత్యాయత్నం చేశారు. ఒకసారి కత్తులతో పొడిచి, చచ్చిపోయాడని వదిలేసి వెళ్లిపోయారు. ఆయన మొండిమనిషి, మళ్లీ బతికాడు. ఎప్పటికైనా ప్రత్యర్థులు చంపుతారన్న భయంతో మళ్లీ సొంతూరికి రాక తప్పలేదు. ఊళ్లో మగ్గాలు లేవు. మళ్లీ సిరిసిల్లకు వెళ్లాడు. అక్కడ నాన్న మగ్గం నేస్తుంటే, అమ్మ లడీలు చుట్టేది. ఎంతచేసినా అదే పేదరికం. నాన్నకు ఏదీ పట్టేది కాదు, సీపీఐ జెండా పట్టుకుని తిరగడమే ఆయన పని.
సోడాలు అమ్మాను..
మంచిర్యాల, రవీంధ్రఖనిలోని ఆర్కే4 బొగ్గుబావి దగ్గర పాన్షాప్ ఉండేది. మా అన్నయ్య అక్కడ చిన్న జీతానికి కుదిరాడు. బతకాలి కదా.. మేము కూడా అక్కడికెళ్లక తప్పలేదు. పాన్షాప్ దగ్గర చిన్నచిన్న సాహిత్య సమావేశాలు జరిగేవి. నాన్న మిత్రులంతా వచ్చేవారక్కడికి. ఇంటినిండా ఎర్ర పుస్తకాలే. మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, సోక్రటీస్, స్పార్టకస్, గోర్కీ రకరకాలు. చేతికి దొరికిన పుస్తకాన్ని చదవడమే నా పని. బొగ్గుబాయి దగ్గరే మా మామకు సోడాల షాపు ఉండేది. అందులో జీతగానిగా చేరాను. ఆరుడజన్ల సోడాల బండిని రెండు మూడు కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లేవాణ్ణి. చేతులకు కాయలు కాసేవి, ఇవిగో చూడండి, ఇప్పటికీ ఉన్నాయవి. నా బాధ చూల్లేక ‘పిలగాడికి ఎందుకీ కష్టం’ అని పని మాన్పించేశారు.