ఖురాన్ను తెలుగులోకి అనువదించిన సాహితీవేత్త
హైదరాబాద్ సిటీ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఖురాన్ను తెలుగులోకి అనువదించిన సాహితీవేత్త, గీటురాయి పత్రిక పూర్వ సంపాదకుడు అబుల్ ఇర్ఫాన్(75) ఇకలేరు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన మంగళవారం సైదాబాద్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండ లం తొండపి గ్రామం. తల్లిదండ్రులు రమీజాబీ, బుడేసాహెబ్లు. ఉర్దూ సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇర్ఫాన్ 40 ఏళ్ల క్రితం నీటిపారుదల శాఖలో క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గీటురాయి పత్రికలో ఉపసంపాదకుడిగా, సంపాదకుడిగా 2 దశాబ్దాలు బాధ్యతలు నిర్వర్తించారు.
అప్పుడే ఇర్ఫాన్ ఇస్లామిక్ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అర్థమయ్యే రీతిలో అనువదించారు. ‘ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్’ ను నెలకొల్పారు.ఇర్ఫాన్ 3 దశాబ్దాల సాహిత్య జీవితంలో దాదాపు 30 ప్రఖ్యాత ఉర్దూ రచనలను అనువదించారు. అందులో ‘ఖురాన్ భావామృతం’, ‘ప్రవక్త జీవిత చరిత్ర’, ‘ధన వికేంద్రీకరణ’, ‘శాంతి’, ‘సమరం’, ‘న్యాయం’, ‘ముస్లిం మహిళ’, ‘రమజాన్ ఆశయాలు’, ‘హదీసు హితోక్తులు’, ‘ఇస్లాం చరిత్ర’ తదితర రచనలు ఉన్నా యి. ఆయన కలంపేరు ఆలిఫైన్. కాగా, ఇర్ఫాన్ భౌతిక కాయానికి ఉర్దూ రచయిత యండీ ఉస్మాన్ఖాన్, కవి వాహెద్ తదితరులు నివాళులర్పించారు. సైదాబాద్ శ్మశానవాటికలో అబుల్ ఇర్ఫాన్ అంత్యక్రియలు ముగిశాయి.