రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి కన్నుమూత

కరోనాతో తుదిశ్వాస విడిచిన వరుణ్‌ సందేశ్‌ తాతయ్య

సంతాపం తెలిపిన ఆకాశవాణి ఉద్యోగులు

హైదరాబాద్‌ సిటీ/ నిడదవోలు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి (80) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి మంగళవారం తుదిశ్వాస విడిచారు. రామచంద్రమూర్తికి భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారి పేర్లు విజయసారథి, శ్రీధర్‌ (టెలివిజన్‌ నటుడు), వేణుగోపాల్‌. సినీనటుడు వరుణ్‌ సందేశ్‌.. రామచంద్రమూర్తి మనవడే. రామచంద్రమూర్తి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, నిడదవోలు. విద్యార్థి దశలోనే ఆయన ‘విజయ చంద్రిక’ పేరుతో చేతిరాత పత్రికను నిర్వహించారు. 1959లో వరంగల్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగం పొందారు. 1960 నుంచి కథారచన ప్రారంభించారు. సుమారు 400 కథలు రాశారు.

‘తరంగిణి’, ‘గుడిలో పువ్వు’, ‘తాతా ధితై తథిగిణతోం’ తదితర నవలలు, పలు నాటకాలతో మొత్తం 19 పుస్తకాలు రచించారు. దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘అమెరికా అబ్బాయి’తో సినిమా కథా రచయితగా వెండితెరకు పరిచయమయ్యారు. 1971లో ఆలిండియా రేడియోలో చేరి 1997లో పదవీ విరమణ చేశారు.రామచంద్రమూర్తి ప్రతిభను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2015లో హంస అవార్డుతో సత్కరించింది. ఆయన రాసిన పలు రేడియో నాటికలకు ఐదు నంది అవార్డులు వచ్చాయి. 2018లో రావూరి భరద్వాజ పురస్కారాన్ని అందుకున్నారు. రామచంద్రమూర్తి పెద్దకొడుకు, చిన్నకొడుకు అమెరికాలో స్థిరపడ్డారు. రామచంద్రమూర్తి మరణవార్త తెలిసిన వెంటనే, వారిద్దరూ బయలుదేరారు. వరుణ్‌ సందేశ్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా అంత్యక్రియలకు ఆయన హాజరుకాలేకపోతున్నారని రామచంద్రమూర్తి సోదరుడు నాగేశ్వరరావు తెలిపారు.