రాంనగర్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జీవితంలో విజేతగా నిలిచేందుకు చేయాల్సిన ప్రయత్నాలు, గమ్యం, గమనం నిర్ధేశించుకోవడం, సమయ పాలన, ప్రణాళికలు రూపొందించుకోవడం ఎంత అవసరమో ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం రచించిన ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివా్సగౌడ్ అన్నారు. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకం అత్యధికంగా అమ్ముడు పోవడాన్ని స్వాగతిస్తూ శనివారం మంత్రి శ్రీనివా్సగౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావులు సచివాలయంలో బుర్రా వెంకటేశంను కలిసి సత్కరించారు.
మంత్రి శ్రీనివా్సగౌడ్ మాట్లాడుతూ తొలి రచనతోనే రికార్డు స్థాయిలో ఈ పుస్తకం అమ్ముడుపోతుండడం అభినందనీయమన్నారు. బుర్రా వెంకటేశం కఠోర శ్రమతో ఐఏఎస్ అధికారిగా ఎదిగి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. సమకాలీన పరిస్థితులను, సామాన్యుడు ఎదుర్కొనే బాధలను నర్మగర్భంగా ఈ పుస్తకంలో ఆవిష్కరింపజేశారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన విజేతల జీవితాల గురించి సందర్భోచితంగా చెప్పినతీరు స్ఫూర్తివంతంగా ఉందని ప్రశంసించారు. ఆకలిబాధ, అణచివేత, వివక్షత గురించి జీవితానుభవం ద్వారా తెలుసుకున్న బుర్రా వెంకటేశం, జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సానుకూలంగా స్వీకరించారని అన్నారు. వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ బుర్రా వెంకటేశం ఎంచుకున్న లక్ష్యం వైపు ఎలా పయనం చేయాలో లక్ష్యాన్ని ఛేదించి ఎలా విజేతగా నిలవాలో హృద్యంగా ఆవిష్కరింపచేశారని ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.