నెల్లూరు (కలెక్టరేట్) ఆగస్టు 6 : నగరంలోని వీఆర్సీ మైదానంలో ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు నెల్లూరు పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య చెప్పారు. స్థానికంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల కిందట సొసైటీని స్థాపించామన్నారు. ఈ పండుగలో ప్రభుత్వ ప్రచురణ సంస్థలైన కేంద్ర సాహిత్య అకాడమీ, పబ్లికేషన్ డివిజన్ కాకుండా ప్రముఖ ప్రచురణకర్తలు విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఎమెస్కో, జేపీ పబ్లికేషన్స్, నవరత్న బుక్హౌస్ తదితర సంస్థలు పాల్గొంటాయన్నారు. ప్రతి రోజు సా యంత్రం 6 గంటల నుంచి 8గంటల వరకు సాహిత్య కార్యక్రమాలు, 5 నుంచి 6 గంటల వరకు విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తారన్నారు.