రవీంద్రభారతి , జూలై 18 (ఆంధ్రజ్యోతి): పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం పక్షాన ప్రతియేటా అందించే మండలి వెంకటకృష్ణారావు సాంస్కృతిక పురస్కారాన్ని 2019కి గానూ ఆచార్య వెల్చేరు నారాయణరావుకు అందజేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య అలేఖ్య పుంజాల తెలిపారు. విదేశాల్లో, రాష్ట్రేతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారి విద్యా, సాంస్కృతిక అవసరాలు తీర్చడానికి ఆయా ప్రాంతాల్లో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ, పరివ్యాప్తికి విశేష కృషి చేసిన చిరస్మరణీయుడు మండలి వెంకటకృష్ణారావు అని కొనియాడారు. ఆయన పేరిట యూనివర్సిటీ నెలకొల్పిన వెంకటకృష్ణారావు అంతర్జాతీయ కేంద్రం ద్వారా తెలుగుభాష, సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని గుర్తించి పురస్కారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. ఈ పురస్కారానికి ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ ఆర్థిక సౌజన్యాన్ని అందిస్తారన్నారు. ఆగస్టు 5న వర్సిటీలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.