హైదరాబాద్, రవీంద్రభారతి, మార్చి 26: రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజల అంతరంగం ఒక్కటేనని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలంగాణలో పుట్టిన శాతకర్ణి అమరావతికి చేరి దేశాన్ని పాలించారని చెప్పారు. ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్‌కు ఉగాది పురస్కారాలను అందజేశారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. వీరితో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురికి విశిష్ట ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడారు. విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు ఒక్కటేనని అన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలని ఆకాంక్షించారు.