హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ‘ఆయనకు 82 ఏళ్లు. లాక్‌డౌన్‌ని పుస్తక పఠనానికి, రచనా వ్యాసంగానికి  అనువుగా మలుచుకున్నారు. రెండు నవలలూ రాశారు. బోలెడు పుస్తకాలూ చదివారు. మరో కొత్త రచన కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు సమకాలీన సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. ఆయనే ఎస్వీ యూనివర్సిటీ మాజీ ఉపాధ్యక్షుడు, తెలుగు సాహితీ దిగ్గజం, ప్రతిష్ఠాత్మక మూర్తిదేవి పురస్కార గ్రహీత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌. సాహిత్య రంగంలో ఆయన స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. కరోనా సెలవులతో ఇనాక్‌ దైనందిన జీవితంలో వచ్చిన మార్పులను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. 

కరోనా నేపథ్యంలో వలస బతుకులపై ఒక నవల రాయాలనే ఆలోచన కలిగింది. అందుకు ప్రస్తుతం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. అదిగాక ఈ మూడు నెలల్లో రెండు నవలలు రాశాను. అందులో అస్తిత్వంలోని ఔన్నత్యాన్ని వెతికే ఒక వ్యక్తి ప్రయత్నం ఇతివృత్తంగా ఒక నవల సాగుతుంది. మరొక నవలలో తల్లిజాడ కోసం పరితపించే ఒక బిడ్డ ఆరాటాన్ని అక్షరీకరించా. నా రచనలన్నీ మనిషి వేదన కేంద్రంగా సాగుతాయి. 

వర్క్‌ఫ్రమ్‌ హోం వల్ల..
వర్క్‌ఫ్రమ్‌ హోం వల్ల నా కొడుకు, కోడలు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్లతో ఎక్కువ సమయం గడిపే అవకాశాన్ని కరోనా అందించింది(నవ్వుతూ...). ముంబాయి ఐఐటీలో చదివే నా మనవడు సుధీరథ్‌, మెడిసిన్‌ చదువుతోన్న నా మనవరాలు సుకీర్తితో కబుర్లాడుతూ కాసేపు కాలక్షేపం చేస్తుంటా. 
 
నా కోసం ప్రత్యేకమైన డైట్‌.. 
లాక్‌డౌన్‌లో బయటకెళ్లొద్దని నా కొడుకు శ్రీకిరణ్‌, కోడలు అనిత స్ట్రిక్ట్‌గా చెప్పారు. దాంతో మా ఇంటి వరండాలోనే ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట నిత్యం నడుస్తున్నా. రోజుకు మూడుసార్లు స్నానం చేస్తున్నా. నా కోడలు రూపొందించిన డైట్‌ చార్టు  ఫాలో అవుతున్నా. రోజూ ఉదయం కషాయం ఇస్తున్నారు. బ్రేక్‌పాస్టులో ఇడ్లీ, దోసె, వడ, పొంగల్‌లో ఏదో ఒకటి తింట. ఒక గ్లాసు రాగిజావ తాగుతా. తర్వాత ఏదైనా ఒక పండు తింటా. నాన్‌వెజ్‌ కన్నా, ఆకుకూరలు, కాయగూరల్ని ఇష్టంగా తింటా. బ్రాందీ, విస్కీనే కాదు.. టీ, కాఫీ కూడా అలవాటు లేదు(నవ్వుతూ...). రోజుకొక కోడిగుడ్డు కంపల్సరీ. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం తక్కువ, కూరలెక్కువ తినడం మొదటి నుంచి అలవాటు. డైనింగ్‌ టేబుల్‌పై పెరుగు ఉండాల్సిందే.