ఆంధ్రజ్యోతి,హైదరాబాద్:మధురమైన స్వరాలతో ప్రియా సిస్టర్స్‌ పలు సంకీర్తనలను ఆలపించి ఓలలాడించారు. బుధవారం రవీంద్రభారతిలో శ్రీ ప్రఖ్య ఆర్ట్స్‌, అభినయ కూచిపూడి కళాక్షేత్ర సంయుక్త ఆధ్వర్యంలో సంకీర్తనామృతం శీర్షికన సంగీత విభావరి జరిగింది. ఇందులో భాగంగా పలువురు యువ గాయనీగాయకులు సంగీతాలాపన చేసి అలరించారు. అనంతరం ప్రియా సిస్టర్స్‌(షన్ముఖప్రియ, హరిప్రియ)లు తమదైన శైలిలో సంకీర్తనలను ఆలపించి మంత్రముగ్ధుల్ని చేశారు. సుస్వరమైన తమ కంఠంతో శ్రోతల్ని మైమరిపించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాజయశ్రీ, దైవాజ్ఞశర్మలతోపాటూ పలువురు ప్రముఖులు హాజరై ప్రియా సిస్టర్స్‌ను ఘనంగా సత్కరించారు.