హైదరాబాద్‌, కోదాడ రూరల్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్‌ను ప్రపంచ తెలుగు మహాసభల్లో విస్మరించడం బాధ్యతారాహిత్యమేనని టీడీపీ-టీఎస్‌ మండిపడింది. శుక్రవారం ఎన్టీఆర్‌భవన్‌లో టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వవైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు భాషకు, తెలుగుజాతికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని టీడీపీ-ఏపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. కాగా, మహాసభల్లో ఎన్టీఆర్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయమని కోదాడకు చెందిన టీడీపీ కార్యకర్త దుర్గంపూడి రాంబాబు తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో గుండు కొట్టించుకొని నిరసన వ్యక్తం చేశారు.