రవీంద్రభారతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డికి వాస్తుశిల్పి డా.బి.ఎన్‌.రెడ్డి సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. గురువారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో యువకళావాహిని ఆధ్వర్యంలో బి.ఎన్‌.రెడ్డి జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, పాలకుర్తి మధుసూదనచారి, అనుమాండ్ల భూమయ్య, మామిడి హరికృష్ణ, మహ్మద్‌ రఫీ తదితరులు హాజరై నందిని సిధారెడ్డిని సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ బి.ఎన్‌.రెడ్డి పురస్కారాన్ని నందిని సిధారెడ్డికి అందజేయడం సముచితమన్నారు. సాహితీసేవలో ఇద్దరిదీ కీలకపాత్రనేనని అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో నందిని సిధారెడ్డి తనదైన కవితలతో చైతన్యపరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.