అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సంగీత, నృత్య అకాడమీ చైర్మన్‌గా కన్నెబోయిన శ్రీనివాసరావు (వందేమాతరం శ్రీనివాస్)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ సెక్రటరీ ముఖే్‌షకుమార్‌ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని సృజనాత్మక, కల్చర్‌ కమిషన్‌ సీఈవోను ఆదేశించారు. కాగా, నామినేటెడ్‌ పోస్టుల్లో నియమితులైన పలువురు బుధవారం రాత్రి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. జానపద అకాడమీ చైర్మన్‌గా నియమితుడైన పొట్లూరి హరికృష్ణ, నాటక అకాడమీ చైర్మన్‌గా నియమితుడైన గుమ్మడి గోపాలకృష్ణ సీఎంని కలిశారు. గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన చంద్రన్న నాటకవరం-శనివారం పోస్టర్‌ను, చంద్రన్న పాలనా విజయాలపై రూపొందించిన ఆడియో-వీడియో సీడీని సీఎం ఆవిష్కరించారు.