కవి, కథకుడు, నవలా రచయిత, పిల్లల కథల రచయిత, వ్యాకర్త ఎనుగంటి వేణుగోపాల్‌. ఎన్నో హాస్య కథలు, మానవీయ కథలు, కుటుంబ కథలు, ఆఫీసు కథలు, ప్రేమ కథలుసహా నవరసాలొలికించే కథలెన్నో రాశారు. 17కథలున్న తాజా కథల సంపుటి ఈ ‘నాలుగు మెతుకులు’. అన్నం తినే సమయంలో గుమ్మంలోకొచ్చి, ‘మాతా అన్నపూర్ణేశ్వరీ! భిక్షాందేహి!’ అని పిలిస్తే, తాము తినడం మానేసి అతిథి కడుపునింపే గొప్ప సంప్రదాయం మనది. ఈ సంపుటిలోని ‘నాలుగు మెతుకులు‌’ టైటిల్‌ కథలో కూడా, ఒక పిచ్చోడు హఠాత్తుగా ఇంట్లోకి జొరబడి, తనకు అపురూపంగా కంచంలో మిగిలిన ఆ ఒక్క ముద్దనీ లాక్కుతింటుంటే, బక్కరైతు బక్కయ్య విస్తుపోయి చూడలేదు. వాడూ తనలాంటి రైతే అనీ, రైతు బాధలతో పిచ్చివాడయ్యాడనీ గుర్తించి అతడి మనోవేదన మనతో పంచుకుంటాడు బక్కయ్య. అత్యున్నతమైన మానవీయతను చాటే మనదైన మట్టి కథలివి.


నాలుగు మెతుకులు

కథల సంపుటి

ఎనుగంటి వేణుగోపాల్‌

ధర : 150రూపాయలు, పేజీలు: 160

ప్రతులకు : ఎ.అంజలి, కృష్ణానగర్‌, జగిత్యాల––327 తెలంగాణ 

సెల్‌ 94402 360 55