నర్సింహం పెద్దగా చదువుకున్నవాడేంకాదు. బాగా డబ్బున్నవాడూ కాదు. మొహమాటస్తుడు కూడాను. ఎవరితోనూ మాట్లాడ్డానికి ధైర్యం చాలేదికాదు వాడి వాలకం తెలిసిన పెద్దమనిషి ఒకాయన జాలిపడి విద్యుత్‌శాఖలో గుమాస్తా ఉద్యోగం వేయించాడు. నర్సింహం అంటే ఆఫీసులో అందరికీ అలుసే. ఉత్త మెతక మనిషి. అయినా అతని జీవితం చాలామటుకు సాఫీగానే గడిచింది. అందుక్కారణం అతని భార్య రాజ్యమే. రాజ్యం చాలా మంచిమనిషి. అయితే బతకనేర్చినతనం కూడా ఉంది. మొగుడు అమాయకుడని పెళ్ళైన కొద్దిరోజుల్లోనే గ్రహించేసింది రాజ్యం. దాంతో తనే సంసారం పగ్గాలు తీసేసుకుని సంసారాన్ని గుట్టుగా నడిపించింది.

నర్సింహం భార్యని చూసి పొంగిపోతూ ఉండేవాడు. ‘‘నువ్వు లేకపోతే నేను బతకలేకపోదును కదా రాజ్యం’’ అనేవాడు ఏకాంతంలో. ఆ మాటలంటున్నప్పుడు అతనికళ్ళల్లో ఆరాధన కనిపిచేంది. ఆ మాటలువిని రాజ్యం కూడా పొంగిపోయేది. అలాటి ఏకాంతసమయంలో రాజ్యం అపురూప సౌందర్యవతిలా కనిపించేది నర్సింహంకళ్ళకి. నిజానికి రాజ్యం పెద్ద అందగత్తేం కాదు. కానీ సర్వవేళలా ఆమెలో సౌందర్యదేవతే కనిపించేది నర్సింహానికి.వాళ్ళకి చాలాకాలం దాకా పిల్లల్లేరు. వైద్యాలు చేయించుకోగా చివరికి ఓ ఆడపిల్ల కలిగింది. అయితే అప్పటికే నర్సింహానికి నలభై ఐదేళ్ళు దాటేశాయి. ‘రిటైరయ్యాక ఈ పిల్ల చదువు సంధ్యలు ఎలారా బాబూ’ అనుకునేవాడు. ‘‘ఫర్వాలేదు. ఏదో ఒకదారి కనబడకపోతుందా’’ అని ధైర్యం చెప్పేది భార్య.నర్సింహం కూతురు నిర్మల చాలా తెలివైంది. పిల్లకి మంచి చక్కదనం కూడా వచ్చింది.

టెన్త్‌ పరీక్షలో సెంటర్‌ ఫస్టు వచ్చింది. కానీ ఏం లాభం? అంతకుముందు సంవత్సరమే నర్సింహం రిటైరయ్యాడు. పెన్షన్‌ బెనిఫిట్స్‌గా వచ్చిన రెండు లక్షలూ పిల్ల పెళ్ళిఖర్చులకు ఉండాలని అలా తీసుకెళ్ళి బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసేశాడు. వచ్చే పెన్షన్‌లోంచి ఎంత ఎక్కువ డబ్బు పొదుపు చెయ్యగలిగితే అంతా చేస్తున్నారు. ఈ పొదుపు కాదుగానీ చాలా పేదవాళ్ళలా జీవితం గడుపుకోవలసి వచ్చింది. ఏతావాతా పిల్లని పై చదువులకి పంపడం సాధ్యంకాదని తేలిపోయింది. పిల్ల చదువుతానని మారాం చేసింది. మరోపక్క తల్లిదండ్రుల నిస్సహాయస్థితి కూడా ఆ పిల్లకి తెలుసు. అందుకనే జూనియర్‌ కాలేజీకి పంపించి తీరాలని పట్టుపట్టలేకపోతోంది. కానీ కాలేజీలో చేరిన తన సహాధ్యాయురాలిని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. కేవలం ఆర్థిక కారణాలవల్ల తన భవిష్యత్‌ అంధకారమైపోయిందని తెలిసిపోయింది పిల్లకి.