కథా-2019 సంపుటి ఆవిష్కరణలో రాజారామ్మోహనరావు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): తెలుగు కథల్లో అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి, ఒక సంకలనంగా తీసుకురావడం అసాధారణ విషయమని, ఇది తెలుగు కథా ప్రస్థానంలో కలకాలం నిలిచే కృషి అని ప్రముఖ రచయిత వి.రాజారామ్మోహనరావు అన్నారు. ‘‘కథా 2019’’ సంకలనాన్ని ఆదివారం చరిత సుబ్బయ్య పురుచూరి, అక్షర సీత పొన్నపల్లి ఆవిష్కరించారు. సభాధ్యక్షత వహించిన రాజారామ్మోహనరావు మాట్లాడుతూ.. ప్రచురణ బాధ్యతలు స్వీకరించిన తానాను అభినందించారు. కథల ఎంపికలో గెస్ట్ ఎడిటర్లనూ భాగస్వామ్యం చేయాలని ఆడెపు లక్ష్మీపతి ప్రతిపాదించారు. ప్రఖ్యాత కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ సంకలనం తీసుకురావడంలో నవీన్, శివశంకర్ మాత్రమే సఫలమయ్యారన్నారు. తానా మాజీ అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ మంచి కథలను ఒకే చోట చదివే అవకాశం కల్పిస్తున్న సంపాదకులకు ధన్యవాదాలు తెలిపారు.